నిర్మల్, జనవరి 27 : నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయంతో అనుసంధానంగా నిలువాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డ ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధ్యక్షుల నియామకంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. మాజీ మంత్రి గడ్డెన్న బాటలో ఆయన కుమారుడు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నడుస్తున్నారని, సౌమ్యుడిగా పేరున్న విఠల్ రెడ్డి ఈ పదవికి వన్నె తెస్తారని అకాంక్షించారు.