Devadula Project | వరంగల్, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు తెలంగాణలోనే అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న జనగామ, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని ప్రాంతాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పచ్చగా మారాయి. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పంటలకు నెలవుగా మారాయి. ఒక పంట, రెండు పంటలు, ఒక్కోసారి మూడో పంట సాగయ్యేలా ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దేవాదుల పెండింగ్ పనులను పూర్తి చేయడంతో ఇది సాధ్యమైంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యం సాకారమైంది.
దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టి పూర్తిచేసింది. హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లోని దేవాదుల పరిధిలోని 6.14 లక్షల ఎకరాలకు, ఎస్సారెస్పీ పరిధిలోని 7.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో సమ్మక్క బరాజ్తోపాటు పనులు చేపట్టింది. ఏడాదిలో 170 రోజులపాటు ప్రతిరోజు 5.18 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు ప్రతి ఎకరాకు సాగునీరు అందుతున్నది. వరంగల్ మహానగరంతోపాటు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతున్నది. దేవాదుల కింద 5.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 2014 వరకు 47,671 ఎకరాలకే సాగునీరు అందేది. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి వసతి పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది వరకు 2,93,943 ఎకరాలకు సాగునీరు అందింది.
ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనుల ప్రకారం దేవాదుల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటర్లు నీళ్లను ఎత్తిపోస్తాయి. వానలు బాగా పడే రోజుల్లో మాత్రమే ఆ నీటి మట్టం ఉం టుంది. దీంతో మొదట నీటిని రిజర్వాయర్లకు, అక్క డి నుంచి పొలాలకు చేర్చాల్సిన పరిస్థితి. 71 మీటర్ల మేరకు నీటి మట్టం ఏడాదిలో గరిష్ఠంగా 3 నెలలే ఉంటుంది. ఆ మేరకే మోటర్లు నడిచేవి. ప్రతి ఎకరాకూ నీళ్లు ఇచ్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రిజర్వాయర్లను, కాలువలను పూర్తిచేసింది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టు పూర్తి స్థిరీకరణ కోసం తుపాకులగూడెం వద్ద బరాజ్ను నిర్మించింది. దేవాదుల పంప్హౌస్ ఉన్న ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల దిగువన ఈ బరాజ్ను నిర్మించింది. 83 మీటర్ల మేరకు నీటిని నిల్వ చేసేలా 92 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మిచింది. ఏడాది పొడవునా మోటర్లు నడిచేలా, నీటి నిల్వ ఉండేలా దీనిని నిర్మించింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.104 కోట్లతో 3 లిఫ్ట్లకు శంకుస్థాపన చేసింది. వీటితో 30 గ్రామాల్లోని 6,790 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టింది.