వేములవాడ : మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు నిషి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు నిరంతర లఘు దర్శనం, కోడెమొక్కులు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు.
ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు. 4 గంటల నుంచి 4.25 గంటల వరకు వరకు సుప్రభాతం, 4. 25 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతః కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం కల్పించనున్నారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు స్వామి వారి కల్యాణ మండపంలో వైభవంగా మహాలింగార్చన జరుగనున్నది. రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగనున్నది.