హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులకు వారిపై ఉన్న కేసుల వివరాలను ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు కారణాలేమిటో తెలపాలని పోలీసులను ఆదేశించింది. బీజేపీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను అధికారులు ఇవ్వడం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
బీజేపీ అభ్యర్థులపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలివ్వాలని కోరుతూ మార్చి 7, 14న డీజీపీకి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో వారిపై ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని చెప్పాలని జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. అయితే, మధ్యాహ్న భోజన విరామం తర్వాత పిటిషనర్ తరఫు న్యాయవాది కల్పించుకుని తాము కోరిన వివరాలన్నీ డీజీపీ నుంచి అందాయని చెప్పడంతో విచారణను ముగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.