హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే కానీ, ఓటర్లను తొలగించడం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 24 ఏండ్ల్లుగా ఓటర్ల జాబితా శుద్ధి జరుగలేదని, ఈ మధ్యకాలంలో చాలామంది మరణించి ఉంటారని, మరికొందరు వలస వెళ్లి ఉంటారని, వాటన్నింటినీ సరిచేయడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపితం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారని, ఇందులో ముస్లిం, హిందూ అనే వ్యత్యాసం ఉండదని, ఒకవర్గం ఓట్లు తొలగిస్తారనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. ఈ భారీ కసరత్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా 48 వేలమంది బూత్ లెవెల్ అధికారుల(బీఎల్వో)ను నియమించినట్టు తెలిపారు. బీఆర్కే భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీఈవో వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా లెకింపు, క్రమబద్ధీకరణ, మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని సీఈవో చెప్పారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్ అందజేసే ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్లు ప్రతి వ్యక్తికి రెండు ఇస్తారని, రెండూ నింపి సంతకాలు చేయాలని, ఒకటి ఓటరు దగ్గర పెట్టుకొని మరొకటి బీఎల్వోలకు ఇవ్వాలని వివరించారు. ఓటరు జాబితాలో ప్రస్తుతం ఎకడ ఓటు ఉన్నదో అదే అడ్రస్కు ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుందని తెలిపారు. ఒకవేళ ఆ అడ్రస్లో ఓటరు ప్రస్తుతం నివసించకపోతే, అతని ఓటు అకడ తొలగించబడుతుందని, అయితే, ఆ ఓటరు ప్రస్తుతం ఉంటున్న కొత్త అడ్రస్తో మళ్లీ ఫామ్-8 ద్వారా ఓటును సులభంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఒకవేళ ఎన్యుమరేషన్ సమయంలో ఎవరైనా మిస్ అయితే, వారికి ఫామ్-6తో పాటు మరోమారు ఎన్యుమరేట్ ఫామ్ అందజేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో సుమారు 89.88 లక్షల ఓటర్ల వివరాలలో కొన్ని తారిక వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపారు. సగటున రాష్ట్రంలో 37.67 శాతం ఓటర్ల డేటాలో తప్పులు ఉన్నాయని, వీటిని సరిదిద్దేందుకు సదరు ఓటర్లందరికీ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసాలు తప్పుగా ఉండటం (15 ఏండ్ల్ల కంటే తకువ లేదా 50 ఏండ్ల కంటే ఎకువ గ్యాప్ ఉండటం), భార్యాభర్త/తండ్రి పేర్లలో రికార్డుల మధ్య తేడాలుండటం, గత రికార్డులకు ప్రస్తుతానికి ఓటరు వయస్సులో తేడాలుండటం, ఆధార్ మాత్రమే ఉండటం లేదా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వంటి 11 రకాల తప్పులను గుర్తించినట్టు వెల్లడించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని నిరూపించేందుకు నిబంధనల ప్రకారం స్వయంగా ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలని సీఈవో సుదర్శన్రెడ్డి చెప్పారు. 1987 జూలై 1వ తేదీ కంటే ముందు జన్మించిన ఓటరు తన సొంత పుట్టిన తేదీ/స్థలాన్ని నిరూపించే ఏదైనా ఒక పత్రం సమర్పించాలని తెలిపారు. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2వ తేదీ మధ్య జన్మించిన ఓటరు తన సొంతపత్రంతోపాటు, తండ్రి లేదా తల్లికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని అన్నారు.