హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జన్యుశాస్త్రం ఆవశ్యకత, లైఫ్ సైన్సెస్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ రూపొందించిన జీనీ బస్సు ఇంటింటికి తిరుగుతుంది. రాష్ట్రంలోని కాలేజీలు, పాఠశాలలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈ బస్సు సంచరించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని పలు కాలనీల్లో పర్యటిస్తూ సీసీఎంబీ జీనీ బస్సు బృందం స్థానికంగా ఉండే పిల్లలకు వైజ్ఞానిక విద్యపై అవగాహన కల్పిస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన బయాలజీ విద్యార్థులు వలంటీర్లుగా సీసీఎంబీ సిబ్బందితో కలిసి అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ సంచార వైజ్ఞానిక మ్యూజియం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుందని సీసీఎంబీ వర్గాలు వెల్లడించాయి.