హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రతి రంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా రవాణాలో కీలకమైన రహదారులనూ వదలడం లేదు. తెలంగాణకు ఇంత చేశాం.. అంత చేశాం అంటూ గొప్పలు చెప్తున్న కేంద్ర పెద్దలు 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలనే విజ్ఞప్తిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసిన రాష్ట్ర అర్అండ్బీ అధికారులు తాజాగా మరో లేఖ రాశారు. వెంటనే 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పెరిగిన అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటిని నేషనల్ హైవేలుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
పక్క రాష్ర్టాలను అనుసంధానం చేయడంతోపాటు పారిశ్రామికవాడలు-ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీగా ఉపయోగపడే అతి ప్రధాన రోడ్లపట్ల జాతీయ రహదారుల శాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. 2015 నుంచి 2018 మధ్య దశలవారీగా పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. 2015 నుంచి దఫాలుగా 14 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. ఏండ్లు గడిచినా కేంద్రం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడంలేదు. 14 రోడ్లు కలుపుకొని సుమారు 1,656 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని ఆర్అండ్బీ అధికారులు కోరుతున్నారు.