‘భట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్నాం. పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అనుభవం ఉన్న నాయకుడు. విక్రమార్కను సీఎంగా చూడాలనే కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పని చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని ప్రకటిస్తారని ఎంతో ఆశగా కుటుంబ సభ్యులమంతా ఆ రోజు టీవీ ముందే కూర్చున్నాం. భట్టి పేరును ప్రకటించకపోవడంతో నా రక్తం చల్లబడిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టయింది. ఆ వార్తను జీర్ణించుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయా. మనసు కుదుటపర్చుకొని తిరిగి ఇంటికొచ్చా.
‘వారు.. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో వారు బలమైన నాయకులు కావడం వల్ల పార్టీలోకి తీసుకున్నాం. అయినప్పటికీ మేము పదేండ్లపాటు కాపాడిన క్యాడరే వారిని గెలిపించింది. వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చాం. ఇంతకన్నా వాళ్లు ఎక్కువ ఆశించకూడదు. అధిష్ఠానానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వారికి దక్కిన వాటితో సంతోషపడాలి’
-మల్లు నందిని భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనని ఆయన సతీమణి నందిని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అనుభవం ఉన్న నేత భట్టి అని చెప్పారు. ఓ యూట్యూట్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్నాం. పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అన్ని రకాల అనుభవం ఉన్న నాయకుడు సీఎం అయితే మధిర, ఖమ్మం జిల్లానేకాకుండా యావత్తు తెలంగాణ బాగుపడుతదని, పేద ప్రజల జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పని చేశారు.
సీఎల్పీ నేతగా భట్టిని ప్రకటిస్తారని ఎంతో ఆశగా కుటుంబ సభ్యులమంతా ఆ రోజు టీవీ ముందే కూర్చున్నాం. భట్టి పేరును ప్రకటించకపోవడంతో నా రక్తం చల్లబడిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టయింది. ఆ వార్తను జీర్ణించుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయా. మనసు కుదుటపర్చుకొని తిరిగి ఇంటికొచ్చా. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దనే ఉద్దేశంతో లేని నవ్వును ముఖంపై తెచ్చుకొని వారిని ఓదార్చా. ఏది జరిగినా మన మంచికే జరిగిందని, దీనికి ఎదురుతిరుగలేమని, వచ్చిన దాన్నే సంతోషంగా స్వీకరించాలని వారికి చెప్పా’ అని పేర్కొన్నారు. అయితే, పార్టీ కోసం 10 ఏండ్లపాటు భట్టి విక్రమార్క పడ్డ కష్టం మామూలు కష్టం కాదని పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వారు మంత్రి పదవులతో సంతోషపడాలి!
ఖమ్మంలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై నందిని కీలక వ్యాఖ్యలు చేశారు. పారాచ్యూట్ నేతలు వారి కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు అడుగుతున్నారని ప్రశ్నించగా.. ‘వారు.. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో వారు బలమైన నాయకులు కావడం వల్ల పార్టీలోకి తీసుకున్నాం. అయినప్పటికీ మేము పదేండ్లపాటు కాపాడిన క్యాడరే వారిని గెలిపించింది. వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చాం.
ఇంతకన్నా వాళ్లు ఎక్కువ ఆశించకూడదు. అధిష్ఠానానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వారికి దక్కిన వాటితో సంతోషపడాలి’ అని వ్యాఖ్యానించారు. ఖమ్మం ఎంపీగా నందిని పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై యాంకర్ ప్రశ్నించగా.. ‘ఆ ప్రచారం ప్రజల నుంచి వచ్చింది. అది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటే ఎవరూ ఆపలేరు’ అని తన మనసులో మాట బయటపెట్టారు. తాను కూడా ఖమ్మం ఎంపీ బరిలో ఉంటాననే సంకేతాలు ఇచ్చారు.