హైదరాబాద్: హైదరాబాద్ ఏఐజి దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని(Veerabhadram) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గురువారం పరామర్శించారు. గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ్మినేని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా, తదితరులు ఉన్నారు. కాగా, తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నెల 16న అనారోగ్యంతో ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని, అప్పటివరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెంటిలేషన్తో కూడిన చికిత్స అందించడం జరుగుతుందని వెల్లడించారు.