హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని సూచించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సీఎండీ, డైరెక్టర్ ఎన్వీ కే శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణిలో కారుణ్య నియామకాల కింద ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. సింగరేణి కార్మికుల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా చేసుకొన్న రూ. కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పం దం, పురోగతి గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు కోల్ ఇండియాలోనూ ఇలాంటి ఒప్పందం లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకొంటామని ఈ స ందర్భంగా డిప్యూటీ సీఎంకు సీఎండీ బలరామ్ వివరించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంటును ఈ నెల 26న ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరిఖని, మంచిర్యాల కార్మికులకు సురక్షిత మంచినీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్లర్ల ప్రారంభానికి సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
కాగా, డిప్యూటీ సీఎం ఆదేశాలమేరకు సింగరేణిలో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎండీ బలరామ్ వెల్లడించారు. వారసత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని 40 ఏండ్లకు పెంచే ప్రతిపాదనలపై అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ను ఆయన ఆదేశించారు.