హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం జరిగిన రోజు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయినట్టు గవర్నర్కు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్గా రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీనికి సీఎం రేవంత్రెడ్డితో పాటు సహచర మంత్రులు కూడా హాజరైనప్పటికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాలేకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
ఢిల్లీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడే ఉండిపోవడంతో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినట్టు ఆయన సన్నిహితుల సమాచారం. ఇదే విషయాన్ని గవర్నర్ను కలిసిన సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేసినట్టు తెలిసింది. కాగా, డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కూడా గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.