హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ రద్దు విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని ఒకసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ శివార్లలో గత ప్రభు త్వం 30 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకే చోట ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసినట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దాని స్థానంలో 3,000 ఎకరాల చొప్పున వివిధ ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. హైటెక్ సిటీలోని ఓ హోటల్లో శనివారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-తెలంగాణ విభాగం 2023-24 వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ యన మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రియ ల్ పార్క్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ట్టు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తుందని, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమకు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
మహిళలను తమ ప్రభుత్వం మహాలక్ష్ముల్లా చూస్తున్నదని, ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన వస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు 18.5 కోట్ల మందికి జీరోటికెట్లు జారీచేసినట్టు చెప్పారు. మహి ళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నందున డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. మొకజొన్న, టమాటా, మిర్చి, పత్తి తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పా టు చేయడం వల్ల రైతులకు మేలు జరగడమే కా కుండా ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించే వీలుంటుందని చెప్పారు.
మూసీతో గోదావరి, కృష్ణా అనుసంధానం
నిర్లక్ష్యం చేయడం వల్లే మూసీనది డ్రైనేజీలా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావ రి, కృష్ణ నదులను మూసీకి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీరు పారేలా నదిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు. నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాం, చిల్డ్రన్ పార్, ఫ్లైఓవర్లు, ఎంటర్టైన్మెంట్, బోటిం గ్ తదితర సౌకర్యాలను పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
ఔటర్ రింగ్రోడ్డు, ఆర్ఆర్ఆర్ మధ్య క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. టెక్స్టైల్, గ్రానైట్, ఐటీ, మినరల్స్ తదితర రంగాల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ను మిగతా జిల్లాలతో కలుపుతూ రీజినల్ రింగ్రోడ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.