హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. పెరిగిన విద్యుత్తు డిమాండ్కు అనుగుణంగా కరెంటును సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్తు అందిస్తున్నట్టు వివరించారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాల రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అసలు ఎజెండా అని, ఇందుకోసం ఆ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ పదేండ్ల పాలనలో దేశం అల్లకల్లోలం అయిందన్న ఆయన.. రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదాన్ని తొలగించాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చూసిన సీఎంను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వల్ల బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఓబీసీ కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం ఆస్తులు పంచుతామని రాహుల్గాంధీ చెప్పారని గుర్తుచేశారు.