హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణంలో జాప్యం ఎందుకవుతున్నదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జాప్యానికి కారకులెవరని అధికారులను నిలదీశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్పై పనులను సమీక్షించారు. ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు పెండింగ్లో ఉండటానికి కారణాలేమిటని ప్రశ్నించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు ఎందుకు అప్పగించారని ఆరా తీశారు.
ఈ ప్లాంట్ నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన సంప్రదింపులు, ఒప్పందం విలువ వంటి అంశాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. పర్యావరణ అనుమతులను ఏప్రిల్ నాటికి వస్తే.. సెప్టెంబర్ వరకు రెండు యూనిట్లు, డిసెంబర్ నాటికి మరో రెండు యూనిట్లు ప్రారంభిస్తామని, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్ను పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి మొదలుపెడుతామని బీహెచ్ఈఎల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదా శివమూర్తి, డైరెక్టర్ తజీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పనులన్నీ ఎందుకు పూర్తికాలేదు?
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాతో 2015 జూన్ 6న బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నది. 2017 అక్టోబర్లో వర్ ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదని భట్టి ప్రశ్నించారు. ఆలస్యానికి కారణాలను వివరిస్తూ సకాలంలో తమకు బిల్లులు చెల్లించలేదని బీహెచ్ఈఎల్ అధికారులు తెలిపారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఇబ్బందులు సైతం జాప్యానికి కారణమని పేర్కొన్నారు. రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు అప్పగించిన పనులు విలువ ఎంత? అని మంత్రి ప్రశ్నించగా.. రూ.20,444 కోట్లు అని, మిగిలిన పనులను జెనో ఇతర సంస్థలు చేపట్టాయని అధికారులు తెలిపారు. తాము రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేయగా, రూ.14,400 కోట్ల బిల్లులు చెల్లించారని బీహెచ్ఈఎల్ అధికారులు వెల్లడించారు. రూ.1,167 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు.