Congress | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పులే మిగిలాయని చూపించి.. ఆ పార్టీని బోనులో నిలబెట్టాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘కబడ్డీలో కాలు ఇచ్చి దొరికిపోయినట్టు’గా ఉన్నదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల ద్వారా అడ్డంగా బుక్కయ్యామన్న వాదనను కాంగ్రెస్ నేతలే వినిపిస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం లాభమా..? నష్టమా..? అన్నది వారు తేల్చుకోలేకపోతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనను ఇరుకునపెట్టి ప్రజల ముందు దోషిగా చూపించే వ్యూహం బెడిసికొట్టిందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ఆర్థికస్థితిపై లఘు చర్చ ను ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన శ్వేతపత్రాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారే కానీ, దాని నేపథ్యాన్ని సభ్యులకు వివరించలేదు. శ్వేతపత్రంపై జరిగిన చర్చలో కాం గ్రెస్ పార్టీలో సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డి ఇలా ఎవరికివారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించారు. హరీశ్రావును నిలువరించటంలో, ఆయన లేవనెత్తిన అంశాలపై సరైన అస్ర్తాలను సంధించటంలో తమవాళ్లు సఫలీకృతం కాలేకపోరాయనే వాదన వినిపించింది.
ఆర్థిక వ్యవస్థ విధ్వం సం జరిగిందని భట్టి పేర్కొనగా, రాష్ట్రం దివాలా తీయలేదు, అప్పులు చేయడం సహజమని మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. రాజకీయంగా ఎవరినో విమర్శించడానికో, ఎవరినో బద్నామ్ చేయడానికో శ్వేతపత్రం విడుదల చేయలేదని ఏకంగా సీఎం రేవంత్రెడ్డి పేర్కొనటం గందరగోళానికి గురిచేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ వరంగల్లో సెం ట్రల్ జైలును కూలగొట్టి ఆ స్థానంలో దవాఖాన కట్టడం సరైంది కాదని, దవాఖాన ఊరుబయట ఉండాలని చెప్పటం విమర్శలపాలు చేసిందని అంటున్నారు.
కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయటం ద్వా రా కొత్త అప్పులు పుట్టకుండా చేసిందా? అంటే అవుననే వాదన వినిపిస్తున్నది. పదేండలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని దేశవిదేశాల నిపుణులు, చివరికి ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న సత్యం. కానీ మంచినీరు, తాగునీరు లేవని చెప్పే ప్రయత్నం చేసి కాంగ్రెస్ బొక్కాబోర్లా పడిందనే వాదన వినిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహనకు రాకముందే అతికీలకమైన ఆర్థిక అంశంపై చర్చకు తెరలేపి అధికార పార్టీ తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.