కరీమాబాద్, మే 11: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ మాత్రం లేకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కరీమాబాద్లో 32, 33, 39వ డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బండా ప్రకాశ్ మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని చెప్పారు. 50 ఏండ్లకుపైగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని కాంగ్రెస్.. ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ సంపదను సంస్థలకు దోచి పెడుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని అన్నారు. వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండగా ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం లేదని చెప్పారు. అజంజాహి మిల్లును అమ్ముకున్న ఘనత గత ప్రభుత్వాలదేనని ఆయన దుయ్యబట్టారు.