హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీ మంత్రులవి చిల్లర చేష్టలు.. అసత్య ప్రేలాపనలని మండిపడ్డారు. హరీశ్రావు తరహా ఉద్యమ నేపథ్యం, ఎన్నుకున్న ప్రజలపై మమకారం ఏపీ మంత్రులకు లేవని చెప్పారు. కేసుల గురించి మాట్లాడే మంత్రులు ముందు వారి వీపులు చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
హరీశ్రావుపైగానీ, తమ ప్రభుత్వంపై కానీ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతీదానికి ఇంతెత్తు ఎగిరే ఏపీ మంత్రులు హైదరాబాద్కు రావాల్సి ఉంటుందనే సత్యాన్ని మరచిపోకూడదని చురకలు అంటించారు. అణచివేతతోనే అధికారం చలాయించాలనే దుర్మార్గ విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని వేషాలు వేసినా అధికారం ముమ్మాటికీ బీఆర్ఎస్దేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్నదని, ప్రజాసమస్యలను ఏనాడో పక్కనపెట్టేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార సరళే అందుకు నిదర్శమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ‘బీజేపీకిలోకి పోయి పొరపాటు చేశానని ఈటల రాజేందర్ భావిస్తూ ఉండొచ్చు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీయే గొప్పది, వ్యక్తి వల్ల పార్టీకి ఎప్పుడూ ప్రయోజనం ఉండదనే సత్యాన్ని గ్రహించాలి’ అని బండా ప్రకాశ్ హితవు పలికారు.