హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లో కొనసాగుతున్న డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశామని, త్వరలోనే వారిని రిలీవ్ చేస్తామని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు. 6 నెల ల్లో గురుకుల సొసైటీల ప్రధాన కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్త మ ప్రతిభ చాటిన ఎస్సీ గురుకు ల విద్యార్థులను గురువారం మాసబ్ట్యాంక్లోని సొసైటీ ప్రధాన కార్యాలయంలో మంత్రి అభినందించి మాట్లాడారు.
గురుకుల విద్యార్థులు 99.12% ఫలితాలు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 17,071 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించారని వివరించా రు. 235 గురుకులాలకు 163 గురుకులాల్లో 100% ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. ఇంటర్ సెకండియర్లో 88.22%, ఫస్ట్ ఇయర్లో 77.79% ఉ త్తీర్ణత నమోదైనట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో 441 మంది అర్హత సాధించారన్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీలోని ప్రధాన కా ర్యాలయంలో పలువురు అధికారులు ఏండ్లు గా తిష్టవేయడం, సీనియర్ల స్థానంలో కీలక బాధ్యతల్లో డిప్యుటేషన్పై కొనసాగుతుండడం, ప్రమోషన్లు, కోర్టు కే సులు ఇతర అంశాలు పెండింగ్ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ సంక్షోభంలో ఎస్సీ గు రుకులం’ అనే కథనాన్ని ప్రచురించింది. వాటిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తాజాగా స్పందించారు. డిప్యుటేషన్లను తక్షణం రద్దు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువరించామని అన్నారు. త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలతో భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని వివరించారు. అనంతరం సొసైటీ బీజీ (బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్) సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అంతకుముందు పదో తరగతి ఫలితాల్లో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి, శాలువాలతో సత్కరించారు.