బాసర, ఆగస్టు 12 : సైనికుడిగా మారి దేశ సేవ చేయాలని కలలు కన్నాడా యువకుడు.. గత ఏడాది నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఈవెంట్లన్నీ పాసయ్యాడు.. రాత పరీక్ష రాయటమే తరువాయి. కానీ, కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాలో చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన పార్డ్య వెంకటేశ్కు ఇద్దరు కొడుకులు. చిన్న కుమారుడు మహేశ్ (24) ఆర్మీకి వెళ్లేందుకు సాధన చేస్తున్నాడు. అన్ని ఈవెంట్లు పూర్తి చేసి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్తో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
ఈ పథకాన్ని తీసుకొస్తే ఇన్నేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని సికింద్రాబాద్ అల్లర్లలో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. వీడియో ఫుటేజీల మహేశ్ను గుర్తించిన రైల్వే పోలీసులు.. ఫోన్ చేసి స్టేషన్కు రప్పించి, సంతకం పెట్టించుకొన్నారు. ఇటీవల రైల్వే పోలీసులు మళ్లీ ఫోన్ చేయటంతో.. కేసు వల్ల భవిష్యత్తు ఉండదని, ఆర్మీ ఉద్యోగం రాదని మనస్తాపం చెంది ఈ నెల 9న బాసరలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే సోదరుడు శ్రీనివాస్కు లొకేషన్ పంపించాడు. సమస్య ఏమిటని ఆరా తీసేందుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో శ్రీనివాస్.. డయల్ 100కు సమాచారమిచ్చాడు. రెండు రోజులు వెతికినా జాడ కనిపించలేదు. గురువారం సాయంత్రం గోదావరి ఒడ్డున మృతదేహం తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. అది మహేశ్దేనని గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పరిస్థితి మరెవ్వరికీ రావొద్దు
అన్నా.. ఉద్యోగం వచ్చినట్టేనని పోయినేడే నా తమ్ముడు సంతోషంగా చెప్పిండు. ఆర్మీ ర్యాలీలో అన్ని పాసయ్యానని, ఎన్సీసీ సర్టిఫికెట్తో రాతపరీక్ష రాయకున్నా జాబ్ వస్తదని సంబురపడ్డడు. లైఫ్ సెటిల్ అయినట్టేనన్నడు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ర్యాలీని రద్దు చేసింది. 23 ఏండ్లు దాటితే ఉద్యోగం రాదని మహేశ్ మానసికంగా కుంగిపోయిండు. ఈ మధ్యే కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతానని నిజామాబాద్ వెళ్లిండు. సికింద్రాబాద్ అల్లర్లకు వెళ్లినా అక్కడ ఏ అల్లర్లూ సృష్టించలేదు. రైల్వే పోలీసులు ఫోన్ చేసి వేధించటంతో ఒత్తిడికి లోనైండు. ఇదే నా తమ్ముడి చావుకు కారణం. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావొద్దు. – మహేశ్ సోదరుడు శ్రీనివాస్