హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. గోదావరి నది ఉప్పొంగుతున్నది. శ్రీరాంసాగర్తోపాటు, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద ఉధృతి క్రమంగా పెరిగి గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. కడెం ప్రాజెక్టుకు గురువారం ఉదయం వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రాగా సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణహితలో వరద ప్రవాహం పోటెత్తుతున్నది. ఏకంగా 7.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండగా, 46 మీటర్ల మేర ప్రవాహం ఉన్నది. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. బేసిన్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమంగా కొనసాగుతున్నది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.
గురువారం సైతం ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నీటి పారుదలశాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్తాయి పరిస్థితులపై ఇంజినీరింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అత్యధిక వర్షపాతం నమోదవటం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతున్నదని రజత్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 19 టెరిటోరియల్ ప్రాంతాల్లో చీఫ్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ ఆపరేషన్ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో ఉన్నదని, ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి ఇన్ఫ్లో తగ్గిందని వివరించారు. ఆ ప్రాజెక్టు వద్ద నీటిపారుదలశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నేతృత్వంలో పటిష్ఠ చర్యలు చేపట్టారని తెలిపారు.
కడెం ప్రాజెక్టు 4 గేట్లు తెరుచుకోకపోవటంతో గురువారం ఉదయం ప్రాజెక్టుపై నుంచి వరద పొంగింది. మరమ్మతుల అనంతరం సాయంత్రానికి రెండు గేట్లు తెరుచుకొన్నాయి. అటు.. భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నదని, భద్రాచలం పట్టణంలో వరద నీటి ప్రవాహం కట్టడికి భారీ మోటర్లు పెట్టి నీటిని తోడేస్తున్నట్టు రజత్ కుమార్ వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రెండు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచామని, పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని సంబంధిత ప్రాజెక్టు అధికారులతో నిరంతరం మన రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు సంప్రదిస్తున్నారని వివరించారు. మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులు జలకళతో నిండి ఉన్నాయని ఆయన తెలిపారు. 100 లోపు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చుతున్నామని వెల్లడించారు. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.