హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆలయాల సమగ్రాభివృద్ధికి దశల వారీగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పూజలు, సేవలతోపాటు వసతి సౌకర్యాన్ని ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తొలివిడత రాష్ట్రంలోని 36 ప్రధాన ఆలయాల్లో ఈ మొబైల్ యాప్ ద్వారానే అన్ని సేవలను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
మీసేవ కేంద్రాల నుంచి కూడా బుక్ చేసుకునే అవకాశమున్నది. ప్రసాదాన్ని బుక్ చేసుకుంటే ఇంటివద్దకే చేరవేసేందుకు ఆర్టీసీతో దేవాదాయ శాఖ ఇదివరకే ఒప్పందం చేసుకున్నది. దీంతోపాటు కొత్తగా దర్శనం, సేవల టికెట్లు పొందేందుకు ఆలయాల వద్ద కియోస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ గణేశ్ సహా నగరంలోని ఇతర ప్రధాన ఆలయాల్లో త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. ఇవి సఫలమైతే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల త్వరితగతిన టిక్కెట్లు పొందేందుకు వీలు కలుగుతుందని వారు పేర్కొన్నారు.
మొబైల్ బుకింగ్ సేవలున్న ఆలయాలు
రాష్ట్రంలోని 36 ప్రధాన ఆలయాల్లో తొలివిడత మొబైల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చా రు. వాటిలో బల్కంపేట ఎల్లమ్మ, వేములవాడ రాజరాజేశ్వర, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, సికింద్రాబాద్ మహంకాళి, బాసర సరస్వతి, వరంగల్ భద్రకాళి, హైదరాబాద్ పెద్దమ్మతల్లి, కొండగట్టు హనుమాన్, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కర్మన్ఘాట్ ఆంజనేయస్వామి, కొమురవెల్లి మల్లికార్జునస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సికింద్రాబాద్ గణేశ్, వరంగల్ రామప్ప, వర్గల్ సరస్వతీ, జియాగూడ రంగనాథస్వామి ఆలయాల్లో ఈ అవకాశం ఉన్నది. జాతర, బోనాల సమయాల్లో మేడారం జాతర ప్రసాదం కూడా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.