పెద్దపల్లి : కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గోదావరిఖనిలో శుక్రవారం ప్లకార్డ్స్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఇఫ్ట్ రాష్ట్ర అధ్యక్షుడు టీ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ మాట్లాడారు.
మోదీ దేశంలో బొగ్గు పరిశ్రమను వేలంలోకి తీసుకువచ్చి కార్పొరేట్ అధిపతి ఆదాని అంబానీ లకు అప్పజెపుతున్నాడని విమర్శించారు. బొగ్గు పరిశ్రమలో 11వ వేతన ఒప్పందం పెండింగ్లో ఉందని ఇప్పటికి 7 దఫాలుగా జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తూ గని కార్మికుల వేతన ఒప్పందం ముందుకు సాగకుండా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నందున మోదీ పర్యటనను వ్యతిరేకించాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
మోదీ విధానాల వల్ల 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వెల్లడించారు. సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు కాదు కదా కోట్లాదిమంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారని వాపోయారు. ప్రధాని పర్యటనను సింగరేణి కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.