హైదరాబాద్ : అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ దక్కన్ మాల్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. గత నెల 19న దక్కన్ మాల్లో మంటలు చెలరేగి ఆరు అంతస్థుల భవనం కాలి బూడిదయింది. ఈ ఘటనలో మాల్కు చెందిన ముగ్గురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయిన విషయం తెలిసిందే. దాదాపు 10 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.
చుట్టుపక్కల నివాస గృహాల్లో ఉన్న వారిని అక్కడి నుంచి తరలించి వారికి తాత్కాలిక విడిదిని ఏర్పాటుచేశారు. అగ్ని ప్రమాదం వల్ల భవనం ఏ క్షణానైనా కూలిపోవచ్చని నిపుణుల చేసిన హెచ్చరికలతో భవనం కూల్చివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తలసాని యాదవ్ పలుమార్లు ఘటనా స్థలాన్ని సందర్శించి భవనం కూల్చివేత వల్ల చుట్టు నివాసాలకు , ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కూల్చివేత పనులకు టెండర్లను పిలవడంతో ఓ కంపెనీ ముందుకు వచ్చి టెండర్ను దక్కించుకుని జనవరి 27 నుంచి ప్రారంభించింది. 14 రోజుల తరువాత శుక్రవారం తెల్లవారు జామున పనులు పూర్తయినట్లు సదరు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, విద్యుత్, మెడికల్ శాఖలకు ధన్యవాదాలు తెలిపారు.