తాడ్వాయి, ఫిబ్రవరి 10: ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారంలో ఆదివాసీ చిరు వ్యాపారుల షాపులను శుక్రవారం రాత్రి అధికారులు కూల్చేశారు. మహాజాతర సందర్భంగా గద్దెల పరిసరాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యాపారులంతా సరుకులను ఖాళీ చేశారు. శుక్రవారం రాత్రి కావడంతో రేకులను శనివారం ఉదయం తొలగించేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ అదే రాత్రి మేడారం చేరుకుని రెండు జేసీబీలతో రేకులను ధ్వంసం చేస్తూ షాపులను కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. అయినా వినకుండా అలాగే కూల్చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. కూల్చివేత పనులను నిలిపేసి కారులో వెళ్తుండగా.. తమకు న్యాయం చేసిన తరువాతనే వెళ్లాలంటూ చిరువ్యాపారులు అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు.
‘సీతక్క డౌన్డౌన్, పోలీసులు డౌన్డౌన్, కలెక్టర్ డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ వెంటనే మేడారం చేరుకున్నారు. ఆదివాసీ వ్యాపారులు, పూజారుల సంఘం అధ్యక్షుడితో మాట్లాడి జరిగిన నష్టాన్ని పూడుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శనివారం మేడారం చేరుకున్న కలెక్టర్.. అడిషనల్ కలెక్టర్కు మేడారంలో బాధ్యతలు అప్పగించబోమని, తప్పు జరిగిందని వ్యాపారులు, పూజారులను కోరినట్టు సమాచారం.