హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ప్రజాస్వామ్యాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖూనీ చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అమిత్షా తన అక్కసు వెళ్లగక్కారు. టీఆర్ఎస్ ప్రజాప్రభుత్వ పాలనను నిజాం పాలనతో పోల్చి.. తమది విద్వేషపు స్వామ్యమని ప్రకటించుకున్నారు. సుదీర్ఘకాలంపాటు ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధన ఉద్యమాన్ని టీఆర్ఎస్ నడిపిందని తెలంగాణవాదులు గుర్తుచేస్తున్నారు.
రెండు పర్యాయాలు ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారనే విషయాన్ని విస్మరించి అమిత్షా రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు. 2014లో 63 చోట్ల టీఆర్ఎస్ను గెలిపించిన తెలంగాణ ప్రజానీకం.. 2018 ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టింది. కేంద్రమంత్రి అమిత్షా అసలు వాస్తవాలను విస్మరించి రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో కేంద్రమంత్రి అమిత్షా పదే పదే నిజాంరాచరిక పాలన పేర్కొనటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని రాచరిక పాలనగా పోల్చటం అంటే రాష్ట్ర ప్రజలను అవమానపరచటమేనని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.