హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పోరుబాట పట్టినట్టు సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లోని సమస్యలను పరిషరించాలని కోరుతూ సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. ఒకే యూనియన్కు చెందిన వారిని అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడంతో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.
గత 40 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని వాపోయారు. వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించి, త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, మెట్రోలో కూడా జర్నలిస్టులకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలని కోరారు.
రైల్వే పాసులను పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాల్లోని కలెక్టరేట్లతోపాటు హైదరాబాద్లోని సమాచార, పౌరసంబంధాలశాఖ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. ఫెడరేషన్ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.