Farmers | నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 8: నానా కాష్టాలు పడి పండించిన వడ్లను ఎన్నో ఆశలతో అమ్ముకుందామని తెస్తే కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల్లో కోపం కట్టలు తెంచుకుంటున్నది. ధాన్యం తెచ్చి పది, పదిహేను రోజులైనా కొంటలేరని, కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే నాథుడే లేడని, ఓ దిక్కు గాలివానలు వచ్చి వడ్లు కొట్టుకుపోతున్నా ఎవరూ పట్టించుకుంటలేరని వారిలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వడ్ల కొనుగోళ్లపై సర్కారు నిర్లక్ష్యంపై పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం ఆరబోసి పదిహేను రోజులవుతున్నా కాంటా పెట్టేదిక్కు లేదని నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం చామన్పల్లిలో రైతులు బుధవారం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి పరిస్థితి చేయిదాటినా అధికారులు స్పందించలేదు. చాలాసేపటికి తహసీల్దార్ జానకి వచ్చి రైతులకు సర్దిచెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, తిమ్మాపూర్, రామన్నపేట రైతులు చందుర్తి సింగిల్ విండో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వెంటనే వడ్లు కొనకుంటే కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చింతల్చెరులో వడ్లు రైస్మిల్ల్లులకు తరలించాలని, లారీలకొరత తీర్చాలని ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు, పెద్దగూడెం గ్రామాల రైతులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి నిరసన తెలిపారు. మూడు రోజులుగా కాంటా వేయడం లేదని, వానలతో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం, బొడ్డుగూడెం గ్రామాల రైతులు వలిగొండ-తొర్రూరు రోడ్డుపై గంట సేపు ధర్నా చేశారు. అడ్డగూడూరులోని మిల్లులో టార్గెట్ అయిపోవడంతో ధాన్యం తీసుకోవడం లేదని, నేరేడుచర్లకు కేటాయించడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.
పెద్దపల్లిరూరల్/హుస్నాబాద్, మే 8: ‘రైతులు అధైర్యపడవద్దు. మీ వెంట బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్తో పాటు మేమంతా ఉన్నం. కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనేదాకా ప్రభుత్వంతో కొట్లాడుదాం. యాసంగిలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇచ్చేదాకా ఊరుకోం’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభయమిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గమధ్యంలో పెద్దబొంకూర్ వద్ద కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.
మెదక్, మే 8 (నమస్తే తెలంగాణ) : పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ధర్నా చేస్తానని ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం కూచన్పల్లి ఐకేపీ సెంటర్ను ఆయన పరిశీలించి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవద్దని ఐకేపీ సిబ్బంది చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు లారీల ధాన్యం కొనుగోలు చేసి ఒక లారీ ధాన్యం పైసలు మాత్రమే ఖాతాల్లో వేశారని సుభాశ్రెడ్డి తెలిపారు.
ఆకాల వర్షం నష్టాన్ని వెంటనే అంచనా వేసి ధాన్యాల పంటలు ఎకరానికి రూ.20వేలు, వాణిజ్య పంటలకు రూ.40వేలు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ వర్షాలకు ఏడుగురు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని కోరింది.
ఎండిన ధాన్యాన్నే సకాలంలో కొనుగోలు చేయలేని ప్రభుత్వం ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటామని మొక్కుబడి హామీలిస్తున్నది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రైతుల ఆగ్రహానికి గురికా కుండా ఉండేందుకు మంత్రులు, అధికారులు రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. ఎక్కడిక్కడ ధాన్యం తడిసిసోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎండిన ధాన్యం రోజుల తరబడి కల్లాల్లో మూలు గుతున్నా కొనుగోలు చేయలేదు. తీరా ఇప్పుడు ధాన్యం తడిసిన తర్వాత ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. వాస్తవానికి వారం ముందే అకాల వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచలేకపోయింది. కానీ వానలతో ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయాక తీరిగ్గా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పందించారు. తడిసిన ధాన్యం కొంటామని ప్రకటించారు. కొట్టుకు పోయిన ధాన్యానికి కూడా నష్టాన్ని చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఒకవేళ మంత్రి ఉత్తమ్కు రైతులపై ప్రేమ ఉంటే వర్షం హెచ్చరికలు జారీ చేసినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండిన ధాన్యాన్ని ముందే ఎందుకు కొనలేదనే రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం సుమారు 24 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది.
పదిహేను రోజుల నుంచి రోడ్డుపై వడ్లు ఆరబోస్తున్న. ఇగ కొంటరు, అగ కొంటరని ఎదురు చూస్తున్న. నా దిక్కు చూసేవాళ్లే లేరు. ఇంకా పదిహేను రోజులైనా ఎవరూ వచ్చేటట్టు లేరు. వానలు పడి వడ్లు తడిస్తే అమ్ముడుపోతయే లేదో? వర్షాలకు వడ్లు కొట్టుకుపోతయని భయమైతాంది. రైతులను ఇంత గోస పెడుతున్న ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగులుతది.
– ముజ్జిగ లింగయ్య, రైతు, చామన్పెల్లి
చౌటుప్పల్ మార్కెట్లో వడ్లు పోసి నెలదాటింది. ఇప్పటికీ తూకం వేయలే. కొనేందుకు టైం పడుతుందని అధికారులు అంటున్నరు. మిల్లుల నుంచి లారీలు రావడం లేదంటున్నరు. హమాలీల కొరత ఉంది. మంగళవారం రాత్రి పడ్డ వానకు వడ్లన్నీ తడిసినయి. మళ్లీ వానలు పడి వడ్లు కొట్టుకపోతే ఎవరు బాధ్యులు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధను పట్టించుకోవాలె.
-సుర్కంటి మనోహర, శేరిల్ల, చౌటుప్పల్
నేను గన్నేరువరం సెంటర్కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. ఇప్పటికీ వడ్లు జోకలే. నిర్వాహకులను అడిగితే లారీలు లేవు, హమాలీలు లేరని చెబుతున్నరు. గిట్ల లేటుగ జోకడం వల్ల వానకు వడ్లు తడిసినయ్. టైంకు కొంటే ఇంత నష్టం జరిగేది కాదు. మమ్ముల ప్రభుత్వమే ఆదుకోవాలె. తడిసిన ధాన్యాన్ని కొనాలె. కొనకపోతే ఊరుకునేది లేదు.
– బోయిని అంజయ్య, రైతు, గన్నేరువరం, కరీంనగర్ జిల్లా