హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో సన్న రకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. దేశీయంగా బియ్యం కొరత, ధరల పెరుగుదలే కారణం. సగటున క్వింటాల్కు రూ.2,300-2,500 వరకు ధర పలుకుత్నుది. కోత కోయడమే ఆలస్యం.. కల్లాల్లోనే మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందుగానే సన్నాల రైతులకు అడ్వాన్సు ఇస్తున్నారు. ధాన్యంలో తేమ 30% ఉన్నా సరే క్వింటాకు రూ.1,900 పెట్టి కొంటున్నారు.
ఈ సీజన్లో ధాన్యం మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి రూ.2,060 కాగా, సాధారణ రకానికి రూ.2,040గా ఉన్నది. అయితే తేమ శాతం 17కు మించకూడదు. పొల్లు, మట్టి పెళ్లలు లేకపోతేనే రైతులకు ఈ ధర దక్కుతుంది. గత సంవత్సరం ఇదే సమయంలో సన్నాలకు రూ.1,500 మాత్రమే దక్కింది. ప్రస్తుతం రూ.400 వరకు అధిక ధర లభిస్తున్నది.
ఈ లెక్కన రైతులకు 17% తేమ వద్ద క్వింటాలుకు రూ.2,300-2,500 వరకు ధర దక్కినట్టేనని వ్యాపారులు చెప్తున్నారు. దీంతోపాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకొనిరావడం వంటి శ్రమ రైతులకు తగ్గుతున్నది. ఈ వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో సుమారు 20-25 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగైనట్టు సమాచారం. తద్వారా సుమారు 40-45 లక్షల టన్నుల సన్నాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అంచనా.
ఇతర రాష్ర్టాలకు మన సన్నాలు
తెలంగాణలో సాగవుతున్న సన్న రకం ధాన్యానికి ముఖ్యంగా బీపీటీ, గంగాకావేరీ, ఆర్ఎన్ఆర్ రకాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన మిల్లర్లు, ఇతర వ్యాపారులు ఇక్కడికి వచ్చి సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా ఏటా సుమారు 20 లక్షల టన్నుల సన్నాలు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నట్టు అంచనా. రాష్ట్రంలోని మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కూడా పెద్ద మొత్తంలో సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది.
దేశ వ్యాప్తంగా బియ్యం కొరత
ఇటీవల దేశంలో ఒక్కసారిగా బియ్యం కొరత ఏర్పడింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. క్వింటాలు బియ్యం ధర రూ.5 వేలు దాటింది ఈ నేపథ్యంలో బియ్యం ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులపై 20% పన్నులు విధించింది. దీనికితోడు కొన్ని రాష్ర్టాల్లో వర్షాభావం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. మార్కెట్లో డిమాండ్ను పసిగట్టిన వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి ముందుగానే కొనుగోలు చేస్తున్నారు.