హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీడీ)లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను నీరుగార్చడంతోపాటు అధికారుల బదిలీలు, పోస్టింగులపై లెఫ్టినెంట్ గవర్నర్కు సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టేందుకు నరేంద్రమోదీ సర్కారు ప్రయత్నించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కేంద్రం చర్యలను ఆమోదిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధికారాలను నీరుగార్చడమే అవుతుందని, ఇది రాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం లాంటి సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నదని వినోద్కుమార్ పేర్కొన్నారు.