న్యూఢిల్లీ, జూన్ 9: మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, హిందూమత ప్రచారకర్త యతి నర్సింగానంద్ సహా 32 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలోని పోస్టులను విశ్లేషించి అందరిపై కలిపి రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. జర్నలిస్టు సబా నఖ్వీ పేరు కూడా ఈ జాబితాలో ఉన్నది. దీనిపై ఒవైసీ స్పందించారు. విద్వేష ప్రసంగాలను ఖండించడానికి, విద్వేష ప్రసంగాలు చేయడానికి మధ్య చాలా తేడా ఉన్నదన్నారు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. నూపుర్, నవీన్ జిందాల్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వీరి వ్యాఖ్యలు హింసకు దారి తీయడమే కాకుండా ప్రజల మధ్య విభజనను తీసుకువస్తాయని అన్నారు. బీజేపీ నేతలు తమ విద్వేష వ్యాఖ్యలతో దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని, అంతర్జాతీయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కలిగించారని మమత ఆరోపించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్-అబ్దొల్లాహేన్ బుధవారం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో గురువారం భేటీ అయ్యారు. దీనిపై ఇరాన్ ప్రకటన చేస్తూ.. ‘ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి బుద్ధి చెప్తాం’ అని ధోవల్ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే, కొద్ది సేపటి తర్వాత ఇరాన్ ప్రకటనలో పై వాక్యం మాయమైంది. తమ విదేశాంగ శాఖ వెబ్సైట్ నుంచి ఇరాన్ ఈ వ్యాఖ్యలను తొలిగించింది. మోదీ, జైశంకర్లతో భేటీలో కూడా ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల ప్రస్తావన రాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి చెప్పారు.
registered fir against 32 people involved in provocative speech case name also include