హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగిన సందర్భంగా సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
నిందితులంతా సీబీఐపై ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో ప్రతివాదులంతా ఏప్రిల్ 5లోగా రిప్లయ్ ఫైల్ చెయ్యాలని జస్టిస్ స్వర్ణకాంతశర్మ ఆదేశించారు. ఇక ఈ కేసును ఢిల్లీ హైకోర్టులో మరో బెంచ్కు మార్చాలని కోరుతూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.