హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమసే తెలంగాణ): పేమెంట్ గేట్వేల సర్వర్లను హ్యాక్ చేసి 53 లక్షలు కొట్టేసిన హ్యాకర్ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రివర్స్ హ్యాకింగ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. సైబర్ క్రైం కేసుల్లో హ్యాకర్ను లైవ్లో పట్టుకోవటం దేశంలో ఇదే తొలిసారి. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఏపీలోని విజయవాడకు చెందిన వన్నం శ్రీరామ్దినేశ్కుమార్.. ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. ఇంటర్నెట్పై పట్టుండటంతో వివిధ యాప్లు, సాఫ్ట్వేర్లలో ఉండే బగ్లను వెతికిపట్టుకొనేవాడు.
ఒక్కో బగ్కు 100 డాలర్ల రివార్డు దక్కేది. సొంతంగా గెట్ క్యాబ్, నైట్నెట్షప్, డైలీబాస్కెట్ యాప్లను తయారుచేశాడు. ఆదాయం సరిపోక ఉద్యోగాలకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. దీంతో పేమెంట్ గేట్వేలపై శ్రీరామ్ కన్నుపడింది. గుర్గావ్కు చెందిన బెస్ట్పే నుంచి 20 లక్షలు, మహాగ్రీన్ సంస్థ పేమెంట్ గేట్వే నుంచి 60 లక్షలు కాజేశాడు. వీటిపై ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. మార్చి 15న హైదరాబాద్కు చెందిన ఎక్స్సిలికా సాఫ్ట్వేర్ సొల్యుషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేమెంట్ గేట్వే పేజీని హ్యాక్ చేసి రూ.53 లక్షలు దోచేశాడు. నకిలీ చిరునామాలతో ఉన్న మూడు ఖాతాలకు ఆ డబ్బు బదిలీ చేశాడు.
అక్కడి నుంచి బిట్కైవ.కామ్లోకి వెళ్లి బిట్కాయిన్ కొని, వాటిని రెమిటానో.కామ్ వెబ్సైట్లోకి మళ్లించాడు. అక్కడ రూపాయలుగా మార్చుకొన్నాడు. ఇలా మూడు, నాలుగేండ్లలో రూ.3 కోట్ల వరకు కాజేశాడని సీపీ వివరించాడు. నిందితుడిని పట్టుకొనేందుకు ఎథికల్ హ్యాకింగ్తో రివర్స్ పద్ధతిలో దర్యాప్తు చేస్తూ మూలాలను పసిగట్టి, అతడిని లైవ్లో అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుడి వద్ద రూ.17.2 లక్షల నగదు, మూడు ల్యాప్టాప్లు, 12 మొబైల్ ఫోన్లు, 33 క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకొన్నామని, బ్యాంకులో ఉన్న మరో రూ.14 లక్షలను కూడా స్వాధీనం చేసుకొంటామని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకొన్న సైబర్క్రైం సిబ్బందిని సీపీ అభినందించారు.