KTR on Sisodia Arrest | లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖండించింది. మనీశ్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందన్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయాన్ని తట్టుకోలేకే లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తున్నదని మండి పడ్డారు. బలమైన పార్టీలను ఎదుర్కోలేక పిరికి రాజకీయం చేస్తున్నదని అన్నారు. భవిష్యత్లో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
బీజేపీ దొంగచాటు రాజకీయం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ప్రజాబలం లేక దొడ్డి దారిన రాజకీయం చేసి, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ కుటిల యత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలపై బీజేపీ కుట్రలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారాయని కేటీఆర్ ఆరోపించారు.
ప్రతిపక్షాలను బలహీన పరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు చివాట్లు తిన్న తర్వాత ఓటమి భరించలేక సిసోడియాను అరెస్ట్ చేసిందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిందని, కెమెరాల సాక్షిగా బీజేపీ తీరును ప్రజలు వీక్షించారని చెప్పారు.