హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ) : డిగ్రీ తరహాలో ఇంటర్ విద్యలోనూ బకెట్ సిస్టంను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకుగాను ఇంటర్ విద్య అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించి, అనుమతి వచ్చాక ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. సీఈసీ కోర్సు తీసుకొంటే గతంలో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులుండేవి. తాజా విధానంలో సివిక్స్కు బదులుగా కంప్యూటర్సైన్స్ను తీసుకొనే అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ నడుస్తున్నది. ఇలా మరికొన్ని కొత్త కాంబినేషన్లకు ప్రభుత్వం అనుమతినిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ (సీపీఎస్), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్డాటా అనాలసిస్ (సీసీ అండ్ బీడీఏ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ టెక్నిషన్ (ఈవీఈ), బయో మెడికల్ ఇంజినీరింగ్ టెక్నిషన్ (బీఎంఈ), ఎంబీడెడ్ సిస్టం టెక్నిషన్ (ఈఎస్) వంటి మొత్తం ఆరు కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలను పంపించారు. ఈ ప్రతిపాదనలు విద్యాశాఖ కార్యదర్శి పరిశీలనలో ఉన్నాయి.
వొకేషనల్ కోర్సుల్లో కొత్తగా రెండు సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టగా, తాజాగా మరో సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. వొకేషనల్లో రోబోటిక్స్ను ఆప్షనల్గా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. వొకేషనల్ మొదటి సంవత్సరంలోని రిఫ్రిజిరేషన్ సబ్జెక్టును సెకండియర్లో కొనసాగించి, రోబోటిక్స్ను మొదటి సంవత్సరంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్లో రోబోటిక్స్ అడ్వాన్స్డ్ సబ్జెక్టును సైతం చేర్చారు. అంతేగాక, ఎస్సీ గురుకులాల్లో ఫిలిం ప్రొడక్షన్ కోర్సు నిర్వహణకు ఇంటర్ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఏడుగురు సబ్జెక్టు నిపుణుల కమిటీ కరిక్యులమ్ రూపొందించాక అన్ని కాలేజీల్లో ఫిలిం ప్రొడక్షన్ కోర్సు ప్రవేశపెడతామని అధికారులు పేర్కొంటున్నారు.