హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. కాలేజీల ఏర్పాటుపై ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో రెండు కాలేజీల చొప్పున ఏర్పాటుచేస్తామని నిరుడు మార్చిలో ప్రభుత్వం ప్రకటించినా, ఆ దిశగా అడుగు కూడా ముందుకు వేయలేదని మైనారిటీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ వినతులు బుట్టదాఖలయ్యాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. కనీసం వచ్చే విద్యాసంవత్సరం నాటికైనా గురుకుల డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఏటా 8 వేల మంది స్టూడెంట్స్ బయటకు..
రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల కాలేజీలు, 21 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో సుమారు 10 వేల మంది మైనారిటీ విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో ప్రతి విద్యాసంవత్సరం 8 వేల మంది ఇంటర్ పాసవుతున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్రవ్యాప్తంగా 87 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేశారు. కానీ మైనారిటీలకు ఏ ఒక్క డిగ్రీ కళాశాల నెలకొల్పలేదు. దీంతో ఏటా ఇంటర్ పూర్తిచేస్తున్న మైనారిటీ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి పనిలో చేరుతున్నారు. హోటళ్లు, ప్రైవేట్ కంపెనీలు, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లలో కార్మికులుగా పనిచేస్తున్నారు. విద్యార్థినులకు తల్లిదండ్రులు పెండ్లిళ్లు చేస్తున్నారు.
విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీలు నెలకొల్పాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్పాషా ఆవేదన వ్యక్తంచేశారు .ఈ ఏడాదైనా ప్రభుత్వం గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేయాలని కోరారు.