హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆ కాలేజీలో చదువు బాగా చెప్తారు, అక్కడ సీటొస్తే బాగుండు.. అని అనుకునే విద్యార్థులెందరో. అలాంటివారికి ఉన్నతవిద్యామండలి తీపికబురు అందించింది. డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేసేందుకు తీసుకురానున్న క్లస్టర్ విధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా డిగ్రీ సీటు ఎక్కడొచ్చినా నచ్చిన కాలేజీలో చదువుకునే అవకాశం దక్కనున్నది. డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే ఈ విద్యాసంవత్సరంలో ఈ అవకాశం కల్పించనున్నారు. డిగ్రీ కాలేజీలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు శుక్రవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ డీ రవీందర్, 9 కాలేజీల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్లస్టర్ విధానం అమలుకు 3 కమిటీలను ఏర్పాటుచేశారు. విద్యాసంబంధ అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ర్టాల్లోని పద్ధతులను అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని కమిటీలను ఆదేశించారు.