నిజామాబాద్ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోసులు పట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరుసగా వాహనాల చోరీలు జరుగుతున్నాయి. ఏడాది కాలంగా నిజామాబాద్, ఆర్మూర్తో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో జన సంచారం లేని ఏరియాలో పార్క్ చేసిన వాహనాలు కనిపించకుండా పోతున్నాయి.
ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. వాహన తనిఖీల్లో నిన్న అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పోలీసులకు ఎదురు పడడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిందితుడు శ్రీహరి నుంచి సుమారు పది లక్షల విలువ చేసే తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు.