Rajnath Singh | శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ట్రెడిషన్, ఇన్నోవేషన్ అవసరమని.. రెండింటి సమ్మేళనంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆదివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరేడ్లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాప్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్లు వస్తున్నాయని, వాటిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతపై ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు. కుటుంబానికి, బంధువలకు, స్నేహితులకు, పండగలకి అన్నింటికీ దూరంగా ఉండి శిక్షణను పూర్తి చేసుకున్నారని, అదే శ్రద్ధతో భవిష్యత్తులోనూ పనిచేయాలని చెప్పారు. క్యాడెట్లపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. దేశ గౌరవం, భద్రత ఆధారపడి ఉన్నందని, కావున అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమాన్ని ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పర్యవేక్షించారు.