హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంపట్నం : ఢిల్లీ మద్యం పాలసీతో తనకేమీ సంబంధం లేకపోయినా నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువునష్టం దావా వేయనున్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలు తనపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఆమె న్యాయపోరాటం చేయనున్నారు.
అలాగే తనకు సంబంధం లేని విషయాలతో ముడిపెట్టి తన గౌరవాన్ని మసకబార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇన్జంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయంలో ఆమె ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రమేయం ఉందంటూ బీజేపీ నేతలు, ఆ పార్టీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తనపై చేస్తున్నవి అసత్య ఆరోపణలేనని ఆమె కొట్టిపారేశారు. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొలేక బీజేపీ చిల్లర పాలిటిక్స్ చేస్తుందని ఆమె మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వంపై నిత్యం పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డను అయినందునే బీజేపీ నాయకులు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బురదజల్లటానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. సోమవారం రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేపట్టిన సహస్రచండీయాగం చివరిరోజున పూర్ణాహుతిలో ఆమె పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. ‘కేసీఆర్ బిడ్డను బద్నామ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతడని బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నరు. ఇది వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబసభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా.. మొక్కవోని ధైర్యంతో, మడమతిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం. ఇలాంటి నిరాధార ఆరోపణలకు భయపడేది లేదు’ అని కవిత స్పష్టంచేశారు.
ఇలాంటి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. అధికారబీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని, బిల్కిస్బాను దోషుల విడుదల, ఉద్యోగాల కల్పన వంటి విషయాలపై అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ప్రతిపక్షాల మీద బురద జల్లుతున్నదని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రిని కేసీఆర్ను మానసికంగా కుంగదీయాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యర్థప్రయత్నాలు చేస్తున్నదని, దీనిని ప్రజలంతా గ్రహిస్తున్నారని అన్నారు.
దేశం, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళుతున్నారని.. ఆయన అడుగులో అడుగులేస్తూ తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తాము ఫైటర్స్ అని.. ఇలాంటి చిల్లర చేష్టలకు, చౌకబారు ఆరోపణలకు భయపడబోమని కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు.