హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెంచిన సత్యాగ్రహమని బుధవారం ట్వీట్(ఎక్స్) చేశారు. స్వరాష్ట్ర సమరంలో సముజ్వల సన్నివేశమని కొనియాడారు.
చరిత్రను మలుపుతిప్పిన దీక్ష..!
తల్లి తెలంగాణ సంకెళ్లను తెంచిన సత్యాగ్రహం..
స్వరాష్ట్ర సమరంలో సముజ్వల సన్నివేశం..
స్వాతంత్య్ర పోరాటాన్నిమించిన
సమోన్నత సందర్భం..
యావత్ జాతి ఏకమై ఉద్యమ కడలి
ఉవ్వెత్తున ఎగసిన దృశ్యం..
చావునోట్లో తలబెట్టి గెలిచిన సాహసం..
ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం..
ఆధునిక ప్రపంచంలో
అద్భుతమైన పోరాటఘట్టం..
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..
ఆమరణ రణ నినాదం!
చెకుచెదరని ఉకు సంకల్పం
పట్టుసడలని దీక్షాదక్షతతో
ఆత్మగౌరవ విశ్వరూపం చూపిన సకల జనం..
అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటనతో నెరవేరిన శపథం..
ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టండి..
తెలంగాణ కోసం బొంతు పురుగునైనా
ముద్దుపెట్టుకుంటం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా
మళ్లా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా..
సాహసోపేత నినాదాలతో.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్వప్నాన్ని సత్యంగా మలచి
గమ్యాన్ని ముద్దాడిన గట్టి సిపాయి కేసీఆర్.
నవంబర్ 29.. దీక్షా దివస్
తెలంగాణ సోయిని.. అస్తిత్వాన్ని..
అస్మితను తట్టిలేపే రోజు..
ఆత్మగౌరవ ఆకురాయిపైన మన చైతన్యాన్ని
పదును పెట్టుకునే రోజు!
త్యాగాల స్ఫూర్తితో తెలంగాణకు
పునరంకితం కావాల్సిన రోజు!
జై తెలంగాణ
దీక్షా దివస్ స్ఫూర్తిని కొనసాగిద్దామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నవంబర్ 29వ తేదీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అతి ముఖ్యమైన రోజని బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘తెలంగాణ జైత్రయాత్ర.. కేసీఆర్ శవయాత్రో’ అని నినదించిన కేసీఆర్.. ఆమరణ దీక్షకు పూనుకొని ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు.‘కేసీఆర్గారి పిలుపు.. తెలంగాణ ఊరూరా ప్రతిధ్వనించింది. వాడవాడనూ కదిలించింది. ప్రతి తెలంగాణ బిడ్డను పిడికిలి బిగించేలా చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేందుకు కారణమైంది. దీక్షా దివస్ స్ఫూర్తిని కొనసాగించాలి. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్షకు దిగిన వేళ గుండె లు కన్నీటితో నిండాయని, కానీ ఇప్పుడదే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అప్పటి దీక్షా దివస్ను తలుచుకొంటే, ఇప్పటి తెలంగాణను చూ స్తుంటే అందరి గుండెలు ఆనందంతో పొంగుతున్నాయని బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఆనాడు అన్నం బంద్ చేసి కోట్లాడి తెలంగాణను తెచ్చావ్.. ఇప్పుడు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చావ్.. చిమ్మ చీకట్ల తెలంగాణను వెలుగు జిలుగుల రాష్ట్రంగా మార్చావ్..కన్నీరు కారుస్తున్న రైతన్న కోసం ఉపవాస దీక్షతో రాష్ట్రంతోపాటు గోదావరి నీళ్లు కూడా తెచ్చి వారి కాళ్లు కడిగావ్.. అవ్వా తాతలకు పెద్దకొడుకుగా.. ఆడపడుచులకు అన్నగా.. మేనమామగా.. తాతగా.. అందరికీ ఆప్తుడివయ్యావ్.. ఆ దీక్ష సమయంలో కన్నీటితో కరిగిన మా గుండెలు.. ఇప్పుడు ఆనందంతో ఉప్పొంగుతున్నాయ్’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షను ఎంపీ సంతోష్కుమార్ స్మరించుకున్నారు. ‘దీక్షా దివస్ లోతైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తెలంగాణ గుండె చప్పుడు ప్రతిధ్వనిస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ప్రజలు తమ లెజెండ్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పాలనను కొనసాగించాలని ఇప్పటికే ధృడంగా నిర్ణయించుకున్నారు. ఇది ఉమ్మడి కలలకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.