హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న వరిసాగు నుంచి ఇతర పంటలవైపు అడుగులేస్తున్నాడు. గతేడాది ఇదే సమయంలో 22.32 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, ఈ ఏడాది కేవలం 7.64 లక్షల ఎకరాల్లోనే వరి వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టంచేసిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కూడా తప్పని పరిస్థితుల్లో ఈ ప్రక్రియ నుంచి తప్పుకున్నది. ఈ యాసంగిలో వరిసాగు చేయొద్దని రైతులకు సూచించింది. దీంతో రైతులు వరి సాగు విషయంలో పునరాలోచన చేస్తున్నారని వ్యవసాయశాఖ నివేదిక పేర్కొంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వరి సాగు 14.68 లక్షల ఎకరాలు తగ్గిందని తెలిపింది. అదే సమయంలో ఇతర పంటల సాగు భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా వేరుశెనగ, శెనగ, మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. వేరుశెనగ గతేడాది 2.15 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 3.12 లక్షల ఎకరాలకు పెరిగింది. శెనగ గతేడాది 2.99 లక్షల ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది 3.22 లక్షలకు పెరిగింది. మినుము సాగు 34వేల ఎకరాల నుంచి 66వేల ఎకరాలకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఈ యాసంగి సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 31.53 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ప్రస్తుతం 19.07 లక్షలకు ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఏకంగా 12.46 లక్షల ఎకరాల్లో సాగు తగ్గడం గమనార్హం.