హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. అందులో భాగంగానే 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరు నుంచి 8వ తరగతిలోపు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వబోమని ప్రకటించిందని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8వ తరగతిలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలు ఇవ్వబోమని.. కేవలం 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు కనీసం 10 శాతం నిధులు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే స్కాలర్ షిప్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.