హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యానశాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన పరీక్షపై గురువారం టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ పరీక్షను నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై చర్చించనున్నది. ఉద్యానశాఖలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 22న నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 4న రాత పరీక్షను నిర్వహించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు కమిషన్ హాల్టికెట్లు విడుదల చేయకపోవడంతో పరీక్ష ఉంటుందా? వాయిదా పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం జరిగే భేటీలో ఈ ఎగ్జామ్పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్ అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
మరికొన్ని పరీక్షల షెడ్యూల్
గ్రూప్స్ సహా మరికొన్ని పరీక్షల తేదీలను సైతం గురువారం ఖరారు చేయనున్నది. ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా వేయగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయాల్సి ఉంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఇప్పటికే ప్రకటించగా, ఈ నేపథ్యంలో గురువారం నాటి సమావేశంలో చర్చించి ఆయా తేదీలను ఖరారు చేసే అవకాశాలున్నాయి.