(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో విదేశీ బొగ్గును కనీసం 4 శాతం కలుపాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు కొరత రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంపై ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసీడబ్ల్యూఎఫ్), ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఈఎఫ్ఐ) యూనియన్ సభ్యులు భగ్గుమన్నారు. దేశంలో బొగ్గు సంక్షోభం ఉందంటూ కేంద్రం ఇచ్చిన తాజా ఆదేశాలను ఓ కుంభకోణంగా అభివర్ణించారు. దేశంలో అసలు బొగ్గు కొరత ఉన్నదా? లేదా కృత్రిమ కొరత సృష్టించారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఏకపక్ష నిర్ణయంతో వినియోగదారులపై పెను భారం పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి లబ్ధి కోసం కేంద్రం ఈ ఆదేశాలను ఇచ్చిందని ప్రశ్నలవర్షం కురిపించారు.
ఏకపక్ష విధానాలను అనుమతించబోం
దేశంలో అసలు బొగ్గు కొరతే లేదని, కృత్రిమ కొరతను సృష్టించి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికే కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నదని యూనియన్ సభ్యులు ఆరోపించారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని సెప్టెంబర్ 5న కేంద్రబొగ్గు గనుల శాఖ ఇచ్చిన ప్రకటనను ఈ మేరకు ఉదహరించారు. కేంద్రం తాజా ఆదేశాల మేరకు ఎక్కువ ధర వెచ్చించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొంటే అది అంతిమంగా వినియోగదారులపై పెనుభారాన్ని మోపుతుందని, కరెంట్ చార్జీలను పెంచాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఫారెక్స్ నిల్వలు, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్పై కూడా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించవచ్చని పేర్కొన్నారు. జాతిప్రయోజనాలకు హానిచేసేలా ఉన్న ఇలాంటి ఏకపక్ష విధానాలను తాము అంగీకరించబోయేది లేదని తేల్చిచెప్పారు.
అప్పుడు కూడా ఇలాగే..
ఒకవైపు దేశంలో బొగ్గు కొరత లేదంటూనే, మరోవైపు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలంటూ విద్యుత్తు ప్లాంట్లపై కేంద్రం ఒత్తిళ్లు తీసుకురావడం ఇదేతొలిసారి కాదని యూనియన్ సభ్యులు చెబుతున్నారు. ఈమేరకు ఏప్రిల్-జూలై 2022 మధ్య జరిగిన ఘటనను ప్రస్తావిస్తున్నారు. తాము వాడే బొగ్గులో విదేశీ బొగ్గును కనీసం 10 శాతం కలుపాలని, ఈ మేరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలంటూ కిందటేడాది కూడా కేంద్రప్రభుత్వం విద్యుత్తు ప్లాంట్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చింది. దీంతో దేశీయ బొగ్గు యూనిట్కు (కిలో) రూ. 2కే లభిస్తున్నప్పటికీ, విదేశీ బొగ్గు కోసం రూ. 7 నుంచి రూ. 8 వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని విద్యుత్తు ప్లాంట్లు వాపోయాయి. కేంద్రం విధానాలతో 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నెట్ ప్రాఫిట్లో 7 శాతం మేర నష్టాలు నమోదుచేసింది. అదే పరిస్థితిని కేంద్రం మళ్లీ ఇప్పుడు సృష్టించినట్టు యూనియన్ సభ్యులు మండిపడ్డారు. కాగా, అదానీ గ్రూప్నకు కాసులు కురిపించడానికే, ప్రభుత్వం బొగ్గు దిగుమతుల నిబంధనలు తీసుకొచ్చినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కీలకమైన బొగ్గు గనులే కాదు.. ఆస్ట్రేలియాలోని క్వీన్ల్యాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లోనూ అదానీ గ్రూప్నకు పెద్దయెత్తున బొగ్గు గనులు ఉండటం తెలిసిందే. విదేశాల నుంచి భారత్కు అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తున్న కంపెనీ కూడా అదానీ గ్రూపుదే. అంతేకాదు.. దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కంపెనీ కూడా అదానీదే కావడం గమనార్హం.
ప్రకటన వెనుక ఎవరు?
పౌరులకు, దేశానికి నష్టంకలిగించేలా ఉన్న ‘4 శాతం బొగ్గు దిగుమతుల’ నిర్ణయం వెనుక కార్పొరేట్ల ప్రమేయం ఉన్నదని యూనియన్ సభ్యులు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం వెంటనే వారి పేర్లను చెప్పితీరాలని డిమాండ్ చేశారు. ‘ఒకవేళ ప్రభుత్వం వీటికి జవాబులు చెప్పకుంటే, యావత్తు దేశప్రజానీకం నిరసనల బాట పడుతుంది’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా విదేశీ బొగ్గు దిగుమతుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, కోల్ ఇండియా లిమిటెడ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.