హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. చేతిలో ఉన్న సన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించిన ఈ సంస్థ.. తాజాగా సన్నరకం బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల ద్వారా 2.20 లక్షల టన్నుల పోర్టిఫైడ్ సన్న బియ్యం కొనుగోలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్లు, గురుకులాలు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో సన్నబియ్యం భోజనం కోసం పౌరసరఫరాల సంస్థ అవసరమైన సన్న బియ్యాన్ని ఆయా సంస్థలకు సరఫరా చేస్తుంది. ఇందుకు అవసరమైన సన్నబియ్యాన్ని ఇప్పటివరకు సదరు సంస్థ కొనుగోలు చేసిన ధాన్యం నుంచి, మిల్లర్ల నుంచి సేకరిస్తూ వచ్చింది. గత కొన్నేండ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించింది. 2022-23 యాసంగి సీజన్లో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించింది. దీనిలో 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని కూడా వేలం ద్వారా అమ్మింది. హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఈ ధాన్యాన్ని గన్నీ, మార్కెట్ ఫీజు కాకుండా క్వింటాకు రూ.2,259.9కి దక్కించుకున్నది. తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఆనాడు విక్రయించి ఇప్పుడు సన్న బియ్యం కొనుగోలు చేయడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిర్ణయంతో సంస్థపై ఆర్థికభారం పడే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన క్వింటా సన్న బియ్యానికి గరిష్ఠంగా రూ.2,500 వరకు ఉండేది. కానీ ఇప్పుడు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తే ఎంత ధర పలుకుతుందనే దానిపై స్పష్టత లేదు.
మిల్లర్ల వద్ద క్వింటాల్కు 3,800కు పైనే ధర
సాధారణంగా మిల్లర్ల నుంచి నేరుగా సన్న ధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాకు రూ.3,800 నుంచి రూ.4 వేల వరకు ధర పడనున్నది. ఈ నేపథ్యంలో సంస్థపై ఆర్థికభారం పడే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేలం ద్వారా విక్రయించిన 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఉంచుకొని మిల్లింగ్ చేయిస్తే సుమారు 1.06 లక్షల టన్నుల బియ్యం వచ్చేవని, ఈ మేరకు సంస్థపై ఆర్థికభారం తగ్గే అవకాశం ఉండేది.