పాలకుర్తి : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతి పల్లెల్లో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం విస్తరించి ఉన్న జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో గురువారం పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే అన్ని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందని వెల్లడించారు. సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని తెలిపారు.
మిగతా శాఖలకు భిన్నంగా గ్రామాలకు పంచాయతీరాజ్ శాఖతో ఎక్కువ అనుబంధం ఉందని పేర్కొన్నారు. 21 రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలు ఎక్కువ భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూనే పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ సమీక్షలో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డీఆర్డీవో రాంరెడ్డి , ఏపీడీ నూరుద్దీన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.