నందికొండ, నవంబర్ 17 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధమైన పలు వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ర్టాల్లో ఏదైనా తప్పులు జరిగితే కేంద్రం సలహాలు ఇవ్వాలి తప్ప.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఐటీ శాఖతో కేంద్ర ప్రభుత్వం పనులు చేయించుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ర్టాలను బెదిరించే విధంగా రామగుండం సభలో మోదీ వ్యాఖ్యలు చేయడం ప్రధాని స్థాయికి తగదన్నారు. ప్రధాన మంత్రి అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సి ఉంటుందని, లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారన్నారు.
గుజరాత్లో ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పోలీసుల సమక్షంలోనే అతడిని పోటీ నుంచి విత్డ్రా చేయించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను లాక్కోవాలనే కుట్రపూరిత ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదని సూచించారు.