హిమాయత్నగర్, ఫిబ్రవరి 22: ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం పాలన చేస్తున్నది తప్ప ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. బుధవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో మీడియాతో మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్బ్లాక్ పార్టీ 19వ జాతీయ మహాసభలు గురువారం నుంచి ఈ నెల 26 వరకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరుగుతాయని తెలిపారు.
ఈ మహాసభల్లో దేశంలో జరిగే పరిణామాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. దేశంలో విషపూరితమైన మత జాతీయవాద వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. లాభాలనిచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు హోల్సేల్గా మోదీ విక్రయిస్తున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో ఏఐఎఫ్బీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరాజన్, జ్యోతి రంజన్ మహాపాత్రో, గోవింద్రాయ్, తమిళనాడు శాఖ డిప్యూటీ చైర్మన్ కేవీ కదిరవన్,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అమరేశ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆర్వీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, కార్యదర్శి కే తేజదీప్రెడ్డి, నగర ఇంచార్జి రాములు యాదవ్, నాయకులు వంశీధర్రెడ్డి, వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.