భీంపూర్/ఎదులాపురం, సెప్టెంబర్ 17: విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కారు మహారాష్ట్రలో ప్రమాదానికి గురైంది. ఇందులో ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటన వివరాలు ఇలా.. రెండు రోజులపాటు సెలవులు ఉండటంతో విహారయాత్రకు వెళ్లేందుకు.. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం అర్లి(టీ) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (26) శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కారులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి మరో ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు కలిసి మొత్తం ఎనిమిది మంది.. అమరావతి జిల్లాలోని చిఖల్దార హిల్స్టేషన్, జలపాతాలు, రాష్ట్రసంత్ తుక్డోజీ మహారాజ్ సంస్థాన్ను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చిఖల్దార ప్రదేశంలో పొగమంచు కారణంగా పరిసరాలు సరిగా కనిపించక అదుపుతప్పి 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.
ఇందులో భీంపూర్ మండలం అర్లి(టీ) గొల్లి వైభవ్ యాదవ్ (23), కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (26), తాంసి మండలం కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన శివకృష్ణ (31), భీంపూర్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి నల్లగొండ జిల్లా వాసి కోటేశ్వరరావు (27) అక్కడికక్కడే మరణించారు. కాగా బేల గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు నల్లగొండ జిల్లాకు చెందిన హరీశ్, కే యోగేశ్ యాదవ్, జైనథ్ మండలం పెండల్వాడ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి అయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుమన్, భీంపూర్ మండలం అర్లి(టీ) గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్ గాయపడ్డారు. మృతదేహాలను పోలీసులు అమరావతి దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు కూడా అదే దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చిఖల్దార పోలీసులు తెలిపారు.