హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల విద్యకు ఫుల్ డిమాండ్. సురక్షిత వాతావరణం, క్రమశిక్షణ, చక్కటి చదువులు గురుకులాలకే సొంతం. ఇంత క్రేజీ ఉన్న గురుకులాలను విద్యార్థులు విడిచిపెట్టడం లేదు. గురుకులాల్లో పాఠశాల విద్య పూర్తి చేశాక అదే గురుకులాల్లో ఇంటర్లో చేరుతున్నారు. ఫలితంగా గురుకుల కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు జోరందుకొన్నాయి. ఈ ఏడాది ఫస్టియర్ అడ్మిషన్లు లక్షకు సమీపించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, కేజీబీవీలన్నింటిలోనూ నిరుడుకు మించి విద్యార్థులు ప్రవేశాలు పొందటం విశేషం. చదువుతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గురుకులాల్లో చక్కటి మెనూను అమలు చేస్తున్నారు.
ప్రతీరోజు నెయ్యి, కోడిగుడ్లు, పండ్లు, ప్రోటీన్లు మేళవించిన పౌష్టికాహారం. పాలు, బూస్ట్, సాయంత్రం స్నాక్స్, ఇవేకాకుండా ఐరన్, ఫోలిక్యాసిడ్ అధికంగా ఉండే ఆకుకూరలు, రోజుకో వెరైటీ టిఫిన్లు, స్నాక్స్, పెరుగు, నెలకు రెండు సార్లు మటన్, నాలుగు సార్లు చికెన్ను వడ్డిస్తున్నారు. సాధారణంగా గురుకులాల్లో చదువుకొన్న విద్యార్థులు ఇలాంటి వాతావరణాన్ని వదిలివెళ్లేందుకు ఇష్టపడరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 1,000కిపైగా గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్చేసింది. అన్నింటిలో ఇంటర్ చదువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో గురుకులాల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు వాటిల్లోనే ఇంటర్ చదివేందుకు ప్రవేశాలు పొందుతున్నారు. కాగా, ఈ నెల 16 వరకు ప్రవేశాల గడువు ఉండటంతో అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.